వైద్యం అంటేనే వ్యాపారం అయింది ఈరోజుల్లో. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు ఉన్నా వైద్యం చేయరు. డాక్టర్లు సరిగ్గా ఉండరు. కొన్ని చోట్ల అసలు సౌకర్యాలే ఉండవు. ఇంకొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డబ్బులు ముట్టచెప్పనిదే వైద్యం అందదు. ఇక కార్పొరేట్ ఆసుపత్రులకు వెళితే ఉన్న ఇల్లు కూడా అమ్ముకోవాల్సిందే. కట్టుబట్టలతో బయటికి పంపిస్తాయి కార్పొరేట్ ఆసుపత్రులు. రోజూ ఎన్ని చూస్తున్నాం మనం. కానీ.. అందరూ అలాగే ఉంటారా? అందరు డాక్టర్లు వైద్యాన్ని వ్యాపారం చేస్తున్నారా? అంటే కాదు అని చెప్పుకోవాలి. ఎందుకంటే.. ఓ డాక్టర్... కేవలం 5 రూపాయలకే ఖరీదైన వైద్యాన్ని కూడా అందిస్తున్నారు. అది 45 ఏళ్ల నుంచి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరివద్దా ఒక్క పైసా కూడా ఎక్కువ తీసుకోకుండా వైద్యాన్ని అందిస్తున్న ఆ మహానుభావుడి గురించి తెలుసుకోవాల్సిందే మనం.
ఆయన పేరే వి. తిరువేంగడం. వయసు 70. ఊరు చెన్నై. అక్కడ 5 రూపాయల డాక్టర్ అని ఎవరిని అడిగినా కళ్లు మూసుకొని చెబుతారు. ఆయనకు ఉన్న ఫాలోయింగ్ అలా ఉంటది అక్కడ.
ఇక్కడ మీకు ఇంకో
విషయం చెప్పాలి. తమిళ్ హీరో విజయ్ నటించిన అదిరింది సినిమా గుర్తుందా మీకు. ఆ
సినిమాలో విజయ్ ఓ డాక్టర్. 5 రూపాయలకే పేదలందరికీ వైద్యం అందిస్తుంటాడు. ఆ సినిమా
తీయడానికి స్ఫూర్తి మన 5 రూపాయల డాక్టర్ తిరువేంకటమే. అవును... చెన్నైలోనే కాదు..
పరిసర ప్రాంతాల నుంచి కూడా చాలామంది వచ్చి ఈయన దగ్గర చికిత్స చేయించుకునేవారు.
1973లో ఆయన చెన్నైలోని వ్యాసరపాడిలో తన వైద్య
సేవలను పేదలకు అందించడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన డబ్బుల కోసం
కాకుండా.. పేదలకు సరైన వైద్యం అందాలని పూనుకున్నారు. అందుకే ముందు 2 రూపాయలు, ఆ
తర్వాత 5 రూపాయలకే ఖరీదైన వైద్యం కూడా అందించడం ప్రారంభించారు.
తన వైద్య వృత్తిలో భాగంగా ఆయన ఇప్పటి వరకు ఒక్క
రోజు కూడా సెలవు తీసుకోకుండా వైద్య సేవకు అంకితం అయ్యారంటే ఆయనకు వైద్య వృత్తిపై
ఉన్న అభిమానం అటువంటిది. లాక్ డౌన్ సమయంలో మాత్రమే ఆయన తన క్లీనిక్ ను నెలరోజుల
పాటు మూసేశారట. అప్పుడు కూడా ఫోన్ ద్వారా పేషెంట్లకు సూచనలు ఇచ్చేవారట.
చిన్నతనం నుంచి డాక్టర్ కావాలన్న తపనతో ప్రభుత్వ
పాఠశాల, ప్రభుత్వ కళాశాలలో చదువుకొని డాక్టర్ గా పట్టా పొందారు తిరువేంగడం. తను
రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ కళాశాలలో చదివి డాక్టర్ అయ్యానని.. అందుకే తన
వద్దకు వచ్చే పేదలందరికీ కూడా వైద్యం ఉచితంగా దక్కాలన్న గొప్ప ఆలోచనతోనే ఆయన తన
క్లీనిక్ ను ప్రారంభించారు.
తను తీసుకునే 5 రూపాయల ఫీజును కూడా మెడిసిన్స్
కొనుక్కోలేని పేదల కోసం ఖర్చు పెట్టేవారు.
అంతటి గొప్ప
మహనీయుడు ప్రస్తుతం మన మధ్య లేరు. అవును.. ఆయన గుండెపోటుతో ఆగస్టు 16, 2020న మృతి
చెందారు. దాదాపు 45 ఏళ్ల పాటు అవిరామంగా పేదలకు వైద్యం అందించి శాశ్వత నిద్రలోకి
జారుకున్నారు. ఆయన ఈలోకంలో లేకపోవచ్చు గాక.. కానీ.. ఆయన చేసిన సేవలను చెన్నై
వాసులు ఎన్నటికీ మరిచిపోరు. ఆయన మరో పది మందికి స్ఫూర్తినిచ్చారు. వేల మందికి
ఉచితంగా వైద్యం చేసి తన ఘనతను చాటుకున్నారు. ఇంతకన్నా ఆయన ఈ సమాజానికి ఏం చేయగలరు.
హేట్సాఫ్ సర్.
Comments
Post a Comment